కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ రీఓపెన్..త్వరలో సందర్శిస్తానన్న సీఎం రేవంత్

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ సెన్షేనల్‌గా మారిపోయింది.

By Srikanth Gundamalla  Published on  31 Jan 2024 8:45 AM GMT
kumari aunty, food stall, hyderabad, reopen, cm revanth reddy,

 కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ రీఓపెన్..త్వరలో సందర్శిస్తానన్న సీఎం రేవంత్

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ సెన్షేనల్‌గా మారిపోయింది. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్‌ ఫుడ్‌ ద్వారా తక్కువ ధరకే చాలా రకాలైన ఫుడ్‌ ఐటమ్స్‌ను మంచి టేస్టీతో అందిస్తోన్న విషయం తెలుసుకున్న నెటిజన్లు చాలా మంది అక్కడికి క్యూ కడుతున్నారు. అయితే.. సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వడంతో మరింత జనాలు పెరిగారు. కుమారి ఆంటీ ఫేమస్ అయిపోయింది. జనాల క్యూ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. భారీ ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా కుమారీ ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని ఆమె ఫుడ్‌ స్టాల్‌ను మూసేయించారు.

ఫుడ్‌ స్టాల్ మూతపడటంతో కుమారి ఆంటీ ఆవేదన చెందింది. తన కడుపుపై కొడుతున్నారనీ.. న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా, ఇతర యూట్యూబ్‌ చానెళ్ల ద్వారా విజ్ఞప్తి చేసింది. దాంతో.. నెటిజెన్లు పెద్ద ఎత్తున కుమారి ఆంటీకి మద్దతు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆమె షాపును మూసివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్వయంగా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో.. ట్రాఫిక్‌ పోలీసుల అనుమతితో బుధవారం మధ్యాహ్నం కుమారి ఆంటీ తన ఫుడ్‌ స్టాల్‌నున రీఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది కుమారీ ఆంటీ. ఇక ఈ విషయం తెలసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆమె ఫుడ్‌ స్టాల్‌ వద్దకు వెళ్లారు. వందల సంఖ్యలో ఫుడ్‌ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో అక్కడ రద్దీ నెలకొంది.

డీజీపీ ఆదేశాల మేరకు పలువురు పోలీసులు కుమారీ ఆంటీ స్టాల్ వద్దకు వెళ్లారు. రోజూ కంటే మరింత ఎక్కువ మంది రావడంతో పెట్రోలింగ్ నిర్వహించారు. కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి కూడా తాను త్వరలోనే ఆమె స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని చెప్పారు.

Next Story