భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అవగాహన చర్చలు కొనసాగింపు

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ అవగాహన చర్చలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు

By Knakam Karthik
Published on : 16 May 2025 1:47 PM IST

India-Pakistan War, Operation Sindoor, India, Pakisthan, Ceasefire Extended

భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అవగాహన చర్చలు కొనసాగింపు

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ అవగాహన చర్చలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నెల 18వ తేదీ వరకు కాల్పుల విరమణ కొనసాగించాలని నిర్ణయం వెలువడింది. తొలిసారిగా జరిగిన చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు తాత్కాలికంగా ఈ నిర్ణయం ప్రకటించారు. వచ్చే సోమవారం పాక్, భారత్‌ల మధ్య డీజీఎమ్‌ఓల స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు వైపులా పరస్పర నమ్మకం కలిగేలా కొన్ని నిర్ణయాలు, చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

తాత్కాలిక, మధ్యస్థ, దీర్ఘకాలిక కాల్పుల విరమణ అవగాహనపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే అంతర్గత, సరిహద్దు భద్రతలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతర్గతంగా అన్ని రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేస్తోంది.

మరో వైపు ఆపరేషన్ సింధూర్‌కు విరామమే కానీ.. అది ముగియలేదని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలను సన్నద్ధం చేసేలా పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని, ఇవాళ భుజ్ వైమానికి స్థావరాన్ని సందర్శించారు.

ఆపరేషన్ సింధూర్ ప్రతి దాడుల్లో పాకిస్థాన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లను భుజ్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే స్క్వాడ్రన్ లీడర్లు, అధికారులు, రక్షణ బలగాలకు చెందిన సిబ్బంది, సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా పర్యటనలు చేపడుతున్నారు. అంతేకాకుండా కార్గిల్ యుద్దంలో భుజ్ వైమానికి స్థావరం వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషించింది. సరిహద్దుల్లో కీలకంగా ఉన్న వైమానిక స్థావరాలతో పాటు, త్వరలో రాజస్థాన్‌లోని జోద్ పూర్, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వైమానిక స్థావరాలను కూడా రక్షణ శాఖ మంత్రి సందర్శించే అవకాశం.

మరో వైపు, పాక్-భారత్ చర్చలపై విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలుంటాయని, పాక్ అందజేయాల్సిన తీవ్రవాదుల జాబితా, సింధు జలాల ఒప్పందం, “పాక్ ఆక్రమిత కాశ్మీర్” లాంటి అంశాలపై భారత్ చర్చలు జరుపుతుందని మరోసారి స్పష్టం చేశారు.

Next Story