కూతురు కోసం పారిస్ వెళ్లనున్న సీయం జగన్
AndhraPradesh CM Jagan Mohan Reddy To Fly To Paris This Month End
By Nellutla Kavitha Published on 16 Jun 2022 2:31 PM GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరులో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. మొన్న దావోస్ కు వెళ్లింది అధికారిక పర్యటన అయితే, ఇప్పుడు ఫ్రాన్స్ కు వెళ్తున్నది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. ఈనెల 28 నుంచి వారంరోజుల పాటు ఫ్రాన్సు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు జగన్.
సీయం జగన్ పెద్ద కూతురు హర్షా రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్ లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఆమె ఆర్ధిక శాస్త్రంలో పీజీ చదువుతున్నారు. వచ్చే నెల 2న బిజినెస్ స్కూల్లో కాన్వొకేషన్ కార్యక్రమం ఉంది. తన కూతురు కాన్వొకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా తనకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును వారంపాటు సడలించాలని ఆయన కోర్టును కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ కుటుంబంతో సహా పారిస్ వెళ్లనున్నారు.