రేపు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినేట్ భేటి
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 4:01 PM GMTసీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో జరగనుంది. ఈ భేటిలో లాక్డౌన్4.0కు సంబంధించి కేంద్రం కేంద్రం వెలువరించిన మార్గదర్శకాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంట సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల అంగీకారంతో బస్సు సర్వీసులను నడపొచ్చునని కేంద్రం సూచించిన నేపధ్యంలో ఈ అంశంపై కూడా బేటిలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో మే 29 వరకు లాక్డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.
ఇక తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈరోజు కూడా 42 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1551కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారీన పడి 34 మంది మరణించారు.
తెలంగాణలో కరోనా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రేపు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు అవుతుండడంతో.. హైదరాబాద్ వరకు లాక్డౌన్ ను కొనసాగిస్తూ.. మిగతా జిల్లాల్లో సడలింపులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలు గ్రీన్ జోన్లోకి వచ్చాక బస్సు సర్వీసులు నడుపుతామని ఇప్పటికే రవాణా శాఖ మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్లో కాకుండా మిగతా జిల్లాలో బస్సులు నడిచే అవకాశం ఉంది. కేంద్రం ఇచ్చిన సడలింపులు దాదాపు రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఇది వరకే కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఇచ్చిన సడలింపులు రాష్ట్రంలో అమలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.