ప్ర‌భుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 May 2020 4:35 AM GMT
ప్ర‌భుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలని.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఒకే రకమైన మార్కెట్ అని కేసీఆర్ అన్నారు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి.. పండించే విధానంలో మార్పు రావాలని అన్నారు. గ‌తంలో ప్రధాని మోదీకి, అప్ప‌టి వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు విష‌య‌మై అనేక మార్లు చర్చ‌లు జ‌రిపామ‌న్నారు.

చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు

ఏది పడితే అది పండించి.. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దని.. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు ఏ పంట వేస్తే లాభాలు గ‌డిస్తారో ప్రభుత్వమే చెబుతుంద‌ని.. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలని అన్నారు. ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని కేసీఆర్ వ్యవసాయ సమీక్షలో నిర్ణయించారు.

ఈ సారి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని సూచించారు. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని, ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుందన్నారు. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే వ్యవసాయ సమీక్ష నిర్ణయించారు.

Next Story