కమెడియన్ శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా సక్సస్ అయ్యేనా..?
By అంజి Published on 4 Dec 2019 3:48 AM GMTతన కామెడీ టైమింగ్ తో.. పంచ్ డైలాగ్స్ తో.. కడుపుబ్బా నవ్విస్తూ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న కమెడియన్ శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు 'భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు' సినిమా ద్వారా దర్శకనిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా నటించారు.
ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శ్రీనివాసరెడ్డి ఈ సినిమా కథ వెనకున్న అసలు కథ చెప్పాడు. శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే... తక్కువ బడ్జెట్లో ఎంటర్టైన్మెంట్ మూవీని ప్రొడ్యూస్ చేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని.
అలాంటి సమయంలో నేను చేయాల్సిన ఓ సినిమా 20 రోజుల పాటు వాయిదా పడింది. ఆ సమయంలో నాతో 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా చేసిన పరం చెప్పిన పాయింట్ నచ్చి కథను డెవలప్ చేశాం. కథ చాలా బాగా వచ్చింది. దాంతో సినిమా మా కమెడియన్స్ గ్రూప్ ఫ్లయింగ్ కలర్స్ బ్యానర్లో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను అని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే... చాలా మంది కమెడియన్స్ వస్తే కొత్త దర్శకుడు హ్యాండిల్ చేస్తాడో లేదోననిపించింది. అందుకనే నేనే సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నాను.
నేను దర్శక నిర్మాతగా చేయబోయే సినిమా గురించి మా ఆర్టిస్టులకు చెప్పగానే తమ నుండి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని అన్నారు. నేను వారికి ఎలాంటి రెమ్యునరేషన్స్ ఇవ్వలేదు. ఓన్ రిలీజ్ చేస్తుండటం వల్ల రిలీజ్ తర్వాతే డబ్బులు తీసుకుంటామని అందరూ అన్నారు. అలా నేను 'భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు' సినిమాకు డైరెక్టర్గా మారాను అని శ్రీనివాసరెడ్డి తెలియచేసారు. మరి... కమెడియన్ శ్రీనివాసరెడ్డికి దర్శకుడిగా సక్సస్ అయ్యేనో..? లేదో..? చూడాలి.