వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2020 3:37 AM GMT
వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు

భాగ్యనగరం వరుణుడి బీభ‌త్సానికి క‌కావిక‌ల‌మైంది. గ‌త వందేళ్ల‌లో చూడని విధ్వంసాన్ని చవిచూసింది. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక కాలనీలు నీటమునిగాయి. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చ‌ర్య‌లు చేపట్టింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల‌ను ఆదుకోవడానికి సినీతారలు కదిలివచ్చారు. భారీగా విరాళాలు ప్రకటిస్తూ వారికి మేమున్నామనే భరోసాను అందిస్తున్నారు.



‘గడచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్‌ అతలాకుతలం అయిపోయింది. అపారప్రాణనష్టంతో పాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నా. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని కోరుతున్నా’ -(చిరంజీవి)



తెలంగాణలో అసాధారణంగా కురిసిన భారీ వర్షాలు ఊహకందని నష్టాల్ని మిగిల్చాయి. వరద బాధిత కుటుంబాల్ని, నిరాశ్రయుల్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం. ముఖ్యమంత్రి సహాయనిధికి నా వంతు సహాయంగా కోటి రూపాయల విరాళం అందిస్తున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకొచ్చి ప్రజల్ని ఆదుకోవాలని పిలుపునిస్తున్నా-మహేష్‌బాబు

భారీ వర్షాలతో హైదరాబాద్‌ నగరంలోని ఎన్నో ప్రాంతాలు నీట మునిగి లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఏం రిలీఫ్‌ఫండ్‌కు తన వంతుగా అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కోటి యాభై లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.



భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్‌ ప్రజా జీవితంలో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. వరద బాధితులకు సహాయంగా 550 కోట్ల రూపాయల్ని ప్రకటించింది. ప్రభుత్వ చర్యల్ని నేను అభినందిస్తున్నా. ఈ కష్టకాలంలో నావంతు చేయూతగా ముఖ్యమంత్రి సహాయనిధికి 50లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నా’. - నాగార్జున



భారీ వర్షాలు, వరదాలతో హైదరాబాద్‌లోని ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. వరదబాధితుల సహాయార్థం నా వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాభై లక్షల విరాళాన్ని అందజేస్తున్నా. అందరం కలిసి మన హైదరాబాద్‌ పునర్నిర్మాణానికి తోడ్పడుదాం. -ఎన్టీఆర్‌



ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా తెలంగాణ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్నా. వరద సహాయక చర్యల్లో మంత్రి కేటీఆర్‌గారు తొలిరోజు నుంచే చురుగ్గా పాల్గొంటూ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో నా తరపున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 25లక్షల్ని విరాళంగా అందిస్తున్నా. -రామ్‌.



మనం కేరళ కోసం, చెన్నయ్‌ కోసం, సైనికుల కోసం అండగా నిలబడేందుకు ముందుకొచ్చాం. కరోనా టైమ్‌లో వేలాది మందికి సహాయాన్ని అందించాం. ఇప్పుడు మన నగరం కోసం అండగా నిలబడేందుకు ముందుకొద్దాం. నా వంతుగా 10 లక్షల విరాళాన్ని ఇస్తున్నా. మీకు తోచినంత సాయం చేయండి - విజయ్‌ దేవరకొండ

Next Story