22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాదిసంద‌ర్భంగా శ్రీవారిఆల‌యంలో ఈ నెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2023 9:33 AM GMT
22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది సంద‌ర్భంగా క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో ఈ నెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) తెలిపింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 3 గంటలకు సుప్రభాతం సేవ అనంత‌రం ఆల‌య‌ శుద్థి నిర్వహిస్తారు.

ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేయ‌నున్నారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టిటిడి రద్దు చేసింది.

మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు :

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మార్చి 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.

ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి స‌హ‌క‌రించాల‌ని టీటీడీ ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరింది.

Next Story