శ్రీవారి భక్తులకు శుభవార్త.. ప్ర‌వేశ ద‌ర్శ‌నం, సర్వదర్శనం అద‌న‌పు టికెట్లు విడుద‌ల‌

TTD Released Tirumala Srivari Darshanam Tickets.కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 4:55 AM GMT
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ప్ర‌వేశ ద‌ర్శ‌నం, సర్వదర్శనం అద‌న‌పు టికెట్లు విడుద‌ల‌

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభ‌వార్త‌. ప్ర‌వేశ ద‌ర్శ‌నం, సర్వదర్శనం టోకెన్ల అద‌న‌పు కోటా టోకెన్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) నేడు(బుధ‌వారం) విడుద‌ల చేసింది. ఈ నెల 24 నుంచి 28 వ‌ర‌కు రోజుకు అద‌నంగా 13వేల చొప్పున రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టికెట్లు కావాల్సిన భ‌క్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో పొంద‌వ‌చ్చు.

అలాగే.. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ను ఫిబ్ర‌వ‌రి 26 నుంచి 28వ వ‌ర‌కు అద‌నంగా రోజుకు 5,000 చొప్పున ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన‌ కౌంట‌ర్ల‌లో భ‌క్తుల‌కు అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు 15వేల స‌ర్వ‌ద‌ర్శ‌న టికెట్లు ఇస్తుండగా.. మార్చి నెల నుంచి రోజుకు 20 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో ప్ర‌క‌టిత రోజుల్లో అంద‌జేయ‌నున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) తెలిపింది.

గత నెలలోనూ పరిమిత సంఖ్యలోనే వైబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంచ‌గా.. నిమిషాల వ్య‌వ‌ధిలోనే అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పోయిన సారితో పోలిస్తే ఈ సారి టికెట్ల సంఖ్య పెరిగింది. కాగా..క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో.. శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య‌ను క్రమంగా పెంచుతున్నారు. ఇక స్వామివారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చే భ‌క్తులు క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది.

Next Story