13 నెలల పాపకు ప్రాణం పోశారు.. అరుదైన రికార్డ్

రెండు సంవత్సరాల బాలుడి గుండెను సేకరించి తిరుపతికి తీసుకుని వచ్చి 13 నెలల పాపకు ప్రాణం పోశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 6:10 AM GMT
13 నెలల పాపకు ప్రాణం పోశారు.. అరుదైన రికార్డ్

శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( చిన్న పిల్లల గుండె ఆసుపత్రి) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నెల రోజుల వ్యవధిలో రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వ‌హించింది. వైద్యులు పక్కా ప్రణాళిక‌తో ఎలాంటి గ్రీన్ చానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్ అయిన రెండు సంవత్సరాల బాలుడి గుండెను సేకరించి తిరుపతికి తీసుకుని వచ్చి 13 నెలల పాపకు ప్రాణం పోశారు. ఈ సంద‌ర్భంగా వైద్యుల‌ను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అభినందించారు.

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల చిన్నారికి గుండె తీవ్రంగా దెబ్బ‌తింది. విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో పాప‌ను చూపించ‌గా పాప‌కు గుండె మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అక్క‌డి వైద్యులు తెలిపారు. తిరుపతిలో టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రికి తీసుకువెళ్లాల‌ని సూచించారు. మూడు నెలల క్రితం ఆ పాపను శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చి అడ్మిట్ చేశారు త‌ల్లిదండ్రులు. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేశారు. మందులతో పాప ఆరోగ్యం కాపాడుతూ వచ్చారు.

చెన్నె లోని ఎంజిఎం ఆసుపత్రిలో రెండేళ్ళ బాబుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని, గుండె దానం చేస్తారనే విషయం ఆదివారం శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి తెలిసింది. ఎపి జీవన్ దాన్ సంస్థ, చిన్నపిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్ గణపతి బృందాన్ని ఆయన సమన్వయం చేసుకున్నారు. పాప త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు.

రాత్రి 10-30 గంటలకు పాపకు అవసరమైన పరీక్షలు, కొవిడ్ పరీక్ష కూడా చేసి గుండె మార్పిడి చేయొచ్చని నిర్ధారించుకున్నారు. టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2 గంటల 15 నిముషాల్లో గుండెను తిరుపతి ఆసుపత్రికి తీసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నిముషం కూడా ఆలస్యం చేయకుండా తెల్లవారుజామున 3 గంటలకు గుండె ను తిరుపతి ఆసుపత్రికి తెచ్చారు. 45 నిముషాల్లో మెడికల్ ప్రొసీజర్స్ పూర్తి చేసి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని వైద్య బృందం ఉదయం 4-30 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించి ఉదయం 9-30 గంటలకు విజయవంతంగా పూర్తి చేసింది.

కాగా.. ఈ శ‌స్త్ర చికిత్స‌కు రూ.30ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని, అయితే.. టీటీడీ ప్రాణదానం, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ పథకాల కింద పూర్తి ఉచితంగా చేసిన‌ట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మరో మూడు నాలుగు రోజులు పాపను ఐసీయూలో ఉంచి తరువాత వార్డుకు మారుస్తారన్నారు.

గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అనుమతి లభించిన నెలరోజుల్లోనే రెండు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి వైద్య బృందం దేశంలోనే రికార్డు సృష్టించిందని ఈవో అభినందించారు. నెలరోజుల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కె ఎస్ ఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల విశ్వేశ్వర్ సోమవారం డిశ్చార్జ్ అవుతున్నారన్నారు.


ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రి ప్రారంభించిన 15 నెలల్లోనే 1150 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చిన పిల్లలకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ లేదా ప్రధానమంత్రి ఆరోగ్య భీమా కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వివరించారు. ఇలాంటి ఆసుపత్రి రాష్ట్రంలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రి మాత్రమేనని ఆయన తెలిపారు.

Next Story