తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఎప్ప‌టి నుంచంటే..?

మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2023 8:05 AM GMT
తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఎప్ప‌టి నుంచంటే..?

తిరుమలలో మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఆయా రోజుల్లో రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమివ్వ‌నున్నారు.

తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న.. శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయ‌నున్నారు. రెండవ రోజు (మార్చి 4న) రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరిస్తారు. మూడవ రోజు (మార్చి 5న) శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు (మార్చి 6న) ఐదుసార్లు, చివరి రోజు (మార్చి 7న‌) ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4 తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను ర‌ద్దు చేశారు.

Next Story