కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాని భక్తులు పోటెత్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్ల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం పూర్తి కావడానికి ఒకరోజు కంటే ఎక్కువ సమయం పడుతోంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలను శ్రీవారి సేవలకు ద్వారా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.
ఇదిలా ఉండగా, గురువారం 60,101 మంది భక్తులు తిరుమల ఆలయాన్ని సందర్శించి తమ ప్రార్థనలు చేయగా, 30,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడవాహన సేవను వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.