క‌రోనా ఎఫెక్ట్‌.. విడుద‌ల కానున్న 3వేల మంది ఖైదీలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2020 10:13 AM GMT
క‌రోనా ఎఫెక్ట్‌.. విడుద‌ల కానున్న 3వేల మంది ఖైదీలు

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. భార‌త దేశంలో క‌రోనా వైర‌స్ రోజు రోజుకు వేగంగా విస్త‌రిస్తోంది. కాగా.. దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు తాజాగా 492కు చేరాయి. వీరిలో 37 మంది కోలుకోగా 446 మంది ప్ర‌స్తుతం ప్ర‌త్యేక ప‌రిశీల‌న‌లో ఉన్నార‌ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే 23 రాష్ట్రాల్లో విస్త‌రించిన ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల తొమ్మిది మంది మ‌ర‌ణించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న 1339 జైళ్ల‌లో వాటి సామ‌ర్థ్యానికి మించి 4,66,0884మంది ఖైధీలు ఉన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఖైదీల‌కే కాకుండా జైలు సిబ్బంది, సంద‌ర్భ‌కులు, న్యాయ‌వాదులకు కూడా క‌రోనా ముప్పు పొంచి ఉంది. ఖైదీలకు క‌రోనా సోకే అవ‌కాశం ఉంద‌నే వాద‌న‌ను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. సుప్రీం ఆదేశానుసారం.. ఏడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న ఖైదీల‌ను విడుద‌ల చేయాల‌న్న నిర్ణ‌యానికి తిహార్ ఖైలు అధికారులు వ‌చ్చారు.

సుమారు 3000 ఖైదీల‌ను విడుద‌ల చేయ‌డానికి తిహార్ ఖైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 ఖైదీల‌ను పెరోల్‌పైన‌, అదే సంఖ్య‌లో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీల‌ను మ‌ద్యంత‌ర బెయిల్‌పై రానున్న మూడు నాలుగు రోజుల్లో విడుద‌ల చేస్తాం. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో జైళ్ల‌లో ర‌ద్దీని అరిక‌ట్ట‌డానికి ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని జైశ్ల‌శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సందీప్ గోయ‌ల్ ప్ర‌క‌టించారు. వీరికి నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై విడిచిపెట్టే అవ‌కాశం ఉంది. విడుద‌లయ్యే వారిలో తీవ్ర నేరాలు చేసిన‌వారు, క‌రుడు గ‌ట్టిన ఖైదీలు ఉండ‌ర‌ని ఆయ‌న అన్నారు.

Next Story