ఏపీ: మూడు జిల్లాలో మళ్లీ లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  20 Jun 2020 4:13 AM GMT
ఏపీ: మూడు జిల్లాలో మళ్లీ లాక్‌డౌన్‌

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో దూసుకెళ్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక కరోనా తీవ్రంగా ఉన్న మరో మూడు జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. శుక్రవారం ఒక్క రోజు రాష్ట్ర వ్యాప్తంగా 465 కేసులు నమోదయ్యాయి. అధికంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్‌ కఠినంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 21 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రకాశం జిల్లాల్లో ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు.

ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో లాక్‌డౌన్‌ అమలు కానుంది. ఇటీవల ఓ ఇంటిలో జరిగిన కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరు కాగా, ఇదే కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇద్దరు బంధువుకు పరీక్షలు నిర్వహించగా, కరోనా తేలింది. దీంతో కాశీబుగ్గలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి నియోజకవర్గం మొత్తాన్ని లాక్‌డౌన్‌ ను అమలు చేస్తున్నట్టు తెలిపారు.

అలాగే అనంతపురం జిల్లా కేంద్రంతో సహా ధర్మవరం, తాడిపత్రతి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లలో మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అంతపురం కార్పొరేషన్‌పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఆయా షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు.ఆ తర్వాత ఎవరు కూడా రోడ్లపైకి వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story