హైదరాబాద్: కొండాపూర్‌లో 33 మందికి కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  20 Jun 2020 3:42 AM GMT
హైదరాబాద్: కొండాపూర్‌లో 33 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక హైదరాబాద్‌లో మాత్రం అంతే లేకుండా పోతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. శక్రవారం ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 329కుపైగా కేసులు నమోదు కావడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా ఒకే ప్రాంతంలో 33 కరోనా కేసులు నమోదు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో పని చేసే వైద్యులు, వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 95 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 15 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అందులో కూడా కరోనా పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలా గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కంటే లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన తర్వాత రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 499 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6526 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 198కి చేరుకుంది. అలా రోజురోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కావడంతో జనాలు జంకుతున్నారు. ఇటీవల ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.. కొన్ని రోజులు ఇతర జిల్లాల్లో ‌కూడా మళ్లీ కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పూర్తిగా తగ్గిపోతుందనుకునే లోపే మళ్లీ కరోనా పడగెత్తడం భయాందోళనకు గురి చేస్తోంది. ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే రెండు నెలలకు పైగా లాక్‌డౌన్‌ కారణంగా ఎందరో నష్టపోవాల్సి దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సివస్తోంది. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించే అంశంపై క్లారిటీ ఇచ్చింది. మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉండదని మోదీ స్పష్టం చేశారు.

Next Story