రేపటి నుంచి ఆ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  18 Jun 2020 6:28 AM GMT
రేపటి నుంచి ఆ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విరుచుకుపడుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 12,881కేసులు నమోదు కాగా, 334 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ కాగా, తాజాగా నిన్న ప్రధాని మోదీ మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదని క్లారిటీ ఇచ్చారు. అయితే తమిళనాడులో మాత్రం కరోనా కేసులు తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు నిర్ణయించింది తమిళనాడు ప్రభుత్వం. 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, తరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి ఇది వరకే ప్రకటించారు.

ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఈ లాక్‌డౌన్‌లో మెడికల్‌, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, పెట్రోల్‌ బంక్‌లు ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే తెరుచుకోనున్నాయి. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కేవలం పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఎలాంటి షాపులు తెరిచేందుకు అనుమతి లేదు. ప్రజలు తమ ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వాహనాలపై ప్రయాణించాల్సి ఉంది. అత్యవసర సర్వీసులు, ట్రావెల్స్‌, వైద్య పరమైన అత్యవసర సేవలను అనుమతిస్తారు. అలాగే ఆటోలు, టాక్సీలకు, వైద్య పరమైన అత్యవసర సమయాల్లో మాత్రమే అనుమతి ఉంది. బ్యాంకులు ఈనెల 29, 30 తేదీల్లో 33 శాతం సిబ్బందితో మాత్రమే పని చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో తెలిపింది.

Next Story