మూడు రోజుల శిశువుకు కరోనా పాజిటివ్

By సుభాష్  Published on  2 April 2020 12:24 PM GMT
మూడు రోజుల శిశువుకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు పట్టిపీడిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలో ఒక మహిళకు, మూడు రోజుల శిశువుకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు వైరస్‌ బారి నుంచి కాపాడాలని సదరు మహిళ భర్త ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను కోరారు.

ముంబైలోని చెంబూరు సబర్బన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గత వారం రోజుల కిందట తన భార్యను డెలివరీ కోసం స్థానిక ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక డెలివరీ అనంతరం ప్రైవేటు గదికి తరలించారు. కొద్ది సమయం తర్వాత అదే గదిలో మరో రోగిని కూడా తీసుకువచ్చారు. అయితే ఆమెకు కరోనా ఉంది. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలియనీయకుండా దాచిపెట్టారని మహిళ భర్త ఆరోపించాడు.

ఈ సందర్భంగా ఆమె భర్త మాట్లాడుతూ.. నా భర్యకు, మూడు రోజుల బిడ్డకు పరీక్షల్లో కరోనా పాటిజివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని మాకు ఎవరు చెప్పలేదు. అంతేకాకుండా నా భార్య కదల్లేని స్థితిలో ఉండగా, ఆస్పత్రి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఎందుకని అడిగితే బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదేశాల మేరకు ఖాళీ చేయిస్తున్నామని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. నా భార్యకు, మూడు రోజుల బిడ్డకు కరోనా సోకడంతో వారిని కస్తూర్బా ఆస్పత్రిలోని కరోనా వార్డుకు తరలించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగింది అని ఆమె భర్త ఆరోపించాడు.

Next Story