ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రే.. ఎమ్మెల్సీ అశోక్ బాబు
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 6:02 PM ISTగుంటూరు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ను అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఖండించారు. ఇది ప్రభుత్వం కావాలని చేసిన కుట్రగా మేం భావిస్తున్నామని అశోక్ బాబు అన్నారు. వీసీగా యూనివర్సిటీలో ఎన్నో సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి దామోదర నాయుడు అని అన్నారు. అటెండర్గా పని చేసిన వ్యక్తిని కులం పేరుతో తిట్టాల్సిన అవసరం వీసీకి ఏముందని అశోక్ బాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నియమితులైన వారిని ఏదో విధంగా వేధిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. యూనివర్సిటీలో అధికార పార్టీ నేతలు సూచించిన వారికి పోస్టులు ఇవ్వలేదనే వీసీపై కేసులు నమోదు చేశారన్నారు. రాష్ట్రంలో పొరుగుసేవల సిబ్బందిని తొలగించాలని జీవో ఇవ్వడం సరికాదన్నారు.
నోటిఫికేషన్ లేకుండా సాక్షి ఉద్యోగులను ప్రభుత్వంలోకి ఎలా తీసుకుంటున్నారని.. దీనిపై ప్రభుత్వంపై వివరణ ఇవ్వాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. అరాచక పాలన చేస్తున్న వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బలవంతంగా రాష్ట్రంలోని అందరూ వీసీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదని.. వ్యవస్థపై జరిగిన దాడి అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వీసీ దామోదర్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.