స్మార్ట్‌ ఫోన్ల తయారీ నిలిపివేసిన ప్రముఖ కంపెనీలు

By అంజి  Published on  23 March 2020 5:59 PM IST
స్మార్ట్‌ ఫోన్ల తయారీ నిలిపివేసిన ప్రముఖ కంపెనీలు

ఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఇప్పటికే అనేక సంస్థలు మూసివేశారు. కొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రకటించాయి. ఇక దేశంలో 415 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్‌ ప్రభావం దేశంలో రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల తయారీని నిలిపివేయాలని పలు మొబైల్‌ సంస్థలు సంస్థలు నిర్ణయించాయి.

ఈ నెల 25 వరకు స్మార్ట్‌ఫోన్‌ల తయారీని నిలిపివేస్తున్నామని ఓప్పో, వివో, శాంసంగ్‌లు కంపెనీలు పేర్కొన్నాయి. దేశంలోని 19 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. ఈ క్రమంలో మొబైల్‌ తయారీ కంపెనీలు ఈ ప్రకటన చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నోయిడాలోని స్మార్ట్‌ఫోన్‌ తయారీ ప్లాంట్లను మూసివేశారు. మార్చి 25 తర్వాత తదుపరి ఉత్తర్వుల ఆధారంగా ఈ ప్లాంట్‌లు తెరుచుకునే అవకాశాలున్నాయి.

నోయిడాలోని శాంసంగ్‌ ఫ్యాక్టరీ ప్రతి సంవత్సరం 1.2 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే అతి పెద్ద ప్లాంట్‌ కావడం విశేషం. ఫోన్‌లతో పాటు స్మార్ట్‌ టీవీలు, ఏసీలు, ఫ్రీజ్‌లు, వాషింగ్‌ మెషీన్లుతో ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్‌ వస్తులు ఈ ప్లాంట్‌లోనే తయారవుతాయి. ఇక నోయిడా ప్లాంట్‌లో పని చేసే ఆర్‌అండ్‌డీ ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచి పనిచేయాలని శాంసంగ్‌ సంస్థ కోరింది. మరో మొబైల్‌ కంపెనీ వివో సైతం తమ ప్లాంట్‌ యేతర ఉద్యోగులందరినీ ఇంటి నుంచి పని చేయాలని సూచిచింది. నోయిడా, పుణేలోని ప్లాంట్‌లలో తమ ఉత్పత్తులను ఎల్‌జీ నిలిపివేసింది. చెన్నై, పుణే ప్లాంట్లలో 50 శాతం సిబ్బందితో మొబైల్‌ ఉత్పత్తులు కొనసాగుతాయని ఎరిక్సన్‌ సంస్థ.. ఓ వార్త ఏజెన్సీకి తెలిపింది.

Next Story