కువైట్‌ బాధిత మహిళలకు జగన్‌ సర్కార్‌ అండ

By అంజి  Published on  28 Jan 2020 11:12 AM GMT
కువైట్‌ బాధిత మహిళలకు జగన్‌ సర్కార్‌ అండ

విజయవాడ: కువైట్‌లో పశ్చిమగోదావరికి చెందిన కొందరు మహిళలు ఏజంట్ల చేతిలో మోసపోయి అక్కడ చిక్కుకున్నారు. సీఎం జగన్ అన్నా.. మమ్మల్ని కాపాడన్నా.. అంటూ తమ దీనావస్థను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కువైట్‌లో ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన మహిళల రక్షణ కోసం జగన్‌ సర్కార్‌ కదిలింది. వీడియోపై సీఎం వైఎస్‌ జగన్‌ కార్యాలయం స్పందించింది.

మహిళను స్వదేశానికి రప్పించే చర్యలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో దిశా స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్‌ ఎంబసీతో అధికారులు సంప్రదింపులు జరిపారు. నలుగురు బాధిత మహిళలను కువైట్‌ నుంచి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కాగా సీఎంఓ కార్యాలయంపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంవత్సరం పాటుగా పాకిస్తాన్‌ జైల్లో మగ్గిన ఆంధ్రా మత్స్యకారులకు సీఎం జగన్‌ ప్రభుత్వంలోనే విముక్తి లభించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులను పాక్‌ నుంచి జనవరి మొదటి వారంలో భారత్‌ చేరుకున్నారు.

బతుకుదెరువు కోసం 22 మంది ఆంధ్రా మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రానికి వెళ్లారు. 2018 నవంబర్‌ 31 మత్స్యకారులు అనుకోకుండా పాక్‌ జలాల్లోకి వెళ్లారు. దీంతో వారిని పాకిస్తాన్‌ నేవీ సిబ్బంది అరెస్ట్‌ చేసింది. మత్స్యకారులు విడుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేశాయి. విదేశాంగ శాఖపై ఎంపీలు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. జలార్లు విడుదల కావడంతో మత్స్యకార కుటుంబాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story