లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్.. పోలీసులను తోసేసిన వైఎస్ షర్మిల

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు

By అంజి  Published on  24 April 2023 7:30 AM GMT
Hyderabad, YSRTP, YS Sharmila, Police

లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్.. పోలీసులను తోసేసిన వైఎస్ షర్మిల 

హైదరాబాద్‌: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. షర్మిల కారులో బయటకు వెళ్తుండగా.. పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో షర్మిల.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ షర్మిల రోడ్డుపై బైఠాయించారు. షర్మిలను అక్కడి నుంచి లేవాలని సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. నడుచుకుంటూ వెళుతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేశారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రం లీక్ కేసులో సిట్ కార్యాలయానికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వైఎస్ షర్మిల దాడి చేశారు.

దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై పడి ఉన్న షర్మిలని పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. సొంతపనులకు బయటకు రాకుండా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తనను అరెస్ట్‌ ఎందుకు చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. పోలీసులు తనను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా అనేకసార్లు ఇలానే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు షర్మిల ఇల్లు ఉన్న లోటస్ పాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Next Story