యువత క్రీడా మైదానాలను వదిలేయడం దేశానికి ప్రమాదకరం: సీఎం రేవంత్
దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారన్న అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By - అంజి |
యువత క్రీడా మైదానాలను వదిలేయడం దేశానికి ప్రమాదకరం: సీఎం రేవంత్
దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారన్న అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థితులకు నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చీబౌలీ స్టేడియంలో తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన 74వ బోలానాథ్ ముల్లిక్ స్మారక ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ 2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వివిధ విభాగాలకు చెందిన పోలీసు క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
"యువత నెమ్మదిగా క్రీడలకు దూరమవుతున్నారు. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారు. దేశం కోసం ఏమైనా చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. యువత సరైన దశలో వెళ్లకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది" అని హెచ్చరించారు.
"క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. క్రీడాకారులను తయారు చేసి దేశ ప్రతిష్టను నిలబెట్టాలి. యువతను క్రీడల్లో ప్రోత్సహించండి" అని పిలుపునిచ్చారు.
"భారత్ ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి విశేష పేరు ప్రఖ్యాతులున్నాయి. 1950-60 దశకంలో నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్గా హైదరాబాద్ పేరు గడించింది. దేశంలోనే ఫుట్బాల్ను అంతగా ఆదరించింది. 1956 ఒలంపిక్స్లో ఆడిన ఫుట్బాల్ జట్టులో ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్కు చెందిన వారే.
ఆ క్రమంలో ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్ షిప్ హైదరాబాద్లో నిర్వహించడం గర్వంగా ఉంది. ఈ క్రీడల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన పోలీసు విభాగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. దేశం నలుమూలల నుంచి ఈ క్రీడల్లో పాల్గొని అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించిన టీమ్లకు తెలంగాణ ముఖ్యమంత్రిగా అందరికీ అభినందనలు.
140 కోట్ల జనాభా కలిగిన భారత్ ఒలింపిక్స్లో కనీసం ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోవడం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. గతంలో ఇదే గచ్చీబౌలీలో ఎన్నో క్రీడలు నిర్వహించాం. గడిచిన కొన్నేళ్లుగా పట్టించుకోలేదు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో మనవాళ్లు ఓడిపోగానే కొద్దిరోజులు చర్చించి ఆ తర్వాత విస్మరిస్తున్నారు. యువత మాదక ద్రవ్యాల వలలో పడి నిర్వీర్యమైపోతోంది. వీరుల భూమి, ఎంతోమంది త్యాగధనులకు కేంద్రమైన పంజాబ్లో ఈరోజు మాదకద్రవ్యాల గురించి వినిపిస్తోంది.
అందుకే ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఎంతో మంది నిష్ణాతులతో కలిసి రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పాం. క్రీడల్లో రాణించిన వారికి అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది.
సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాలతో సమాజంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పోలీసు విభాగాలకు చెందిన క్రీడాకారులు మైదానాల్లో ఎలాగైతే ప్రతిభను, స్ఫూర్తిని కనబరిచారో సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నియంత్రణలో కూడా ప్రతిభను కనబరచాలి.." అని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.