గుంతలను పూడ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీ: మంత్రి కోమటిరెడ్డి
రోడ్లపై గుంతలను పూడ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 12 Nov 2024 9:44 AM IST
గుంతలను పూడ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీ: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: రోడ్లపై గుంతలను పూడ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 'ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్, పాట్ హోల్ అండ్ రోడ్ మెయింటనెన్స్ మిషనరీ' యంత్రాలతో రోజుకు 10 నుంచి 20 కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో 9 వేల కిలోమీటర్ల మేర రహదారులు బాగు చేస్తామని పేర్కొన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ రోడ్లపై గుంతలను పూడ్చలేదని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా అధునాతన పద్ధతులు, అత్యాధునిక యంత్రాలతో గుంతలను పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు గ్రామంలో గుంతలు పూడ్చేందుకు సిద్ధం చేసిన 'ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్', 'గుంతలు, రోడ్డు నిర్వహణ మిషనరీ'ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్ అండ్ బి) వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందనతో కలిసి సమీక్షించారు.
మంత్రి చిలుకూరులో పర్యటించి సాంకేతిక నిపుణులతో యంత్రాల పనితీరుపై చర్చించారు. రోజుకు 20 కి.మీ వరకు గుంతలను పూడ్చగలిగే రెండు మిషన్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం రోడ్లపై ఉన్న గుంతలను సరిచేసే మార్గాలను మీడియాకు చూపించారు. సంప్రదాయ పద్ధతుల్లో గుంతలు పూడ్చేందుకు నెలల తరబడి సమయం పడుతుందన్నారు. అంతేకాదు, 90 శాతం కర్బన ఉద్గారాలను తగ్గించగల పర్యావరణ అనుకూల పద్ధతుల వల్ల పర్యావరణానికి హాని తక్కువని చెప్పారు.