తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ ఆటో యూనియన్ విలీనం’
తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ’ తెలంగాణ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విలీనమయ్యింది
By Knakam Karthik
తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ ఆటో యూనియన్ విలీనం’
హైదరాబాద్: తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ’ తెలంగాణ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విలీనమయ్యింది. ఆదివారం బంజారాహిల్స్ లోని నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. యూనిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ సలీం, ప్రధాన కార్యదర్శి సయీద్ రహ్మత్ అలీ హష్మీ సహా యూనియన్ నాయకులందరూ తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్ లోనే అతిపెద్ద ఆటో యూనియన్ తెలంగాణ జాగృతిలో విలీనం కావడం సంతోషకరమని.. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోలకు థర్డ్ పాటీ ఇన్సూరెన్స్ చెల్లించడానికి ఒక్కో డ్రైవర్ పై రూ.8 వేల ఆర్థిక భారం పడుతోందని, దానిని రద్దు చేసి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మోటర్ వెహికిల్ యాక్ట్ వల్ల ఆటోడ్రైవర్లపై భారం పడకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటోడ్రైవర్లకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ను రూ.10 లక్షలకు పెంచాలని, ఈఎస్ఐ హాస్పిటళ్లలో ఆటోడ్రైవర్లకు వైద్య సేవలు అందించాలని కోరారు. ట్యాక్సీ ప్లేట్ వెహికిల్స్ ను మాత్రమే ఓలా, ఉబర్, ర్యాపిడో ద్వారా అనుమతించాలని సూచించారు. ఆటోడ్రైవర్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.