మోదీ ప్రధాని అయ్యాక 'యోగా'ను ప్రపంచానికి గిఫ్ట్‌గా ఇచ్చారు: కిషన్ రెడ్డి

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం, ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik
Published on : 20 Jun 2025 12:18 PM IST

Hyderabad News, International Yoga Day, Union Minister Kishan Reddy, LB Stadium

మోదీ ప్రధాని అయ్యాక 'యోగా'ను ప్రపంచానికి గిఫ్ట్‌గా ఇచ్చారు: కిషన్ రెడ్డి

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం, ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి, ఆచరిస్తున్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశం. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం...అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరుపుకోవాలి. ఈరోజు యోగా 24 గంటల కౌంట్ డౌన్ వేడుకలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించుకుంటున్నాం. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుగు నేల విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడం సంతోషకరం. తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది. యోగానే మనకు ప్రథమ డాక్టర్. యోగా సర్వరోగ నివారిణి. యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. యోగాను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరుతున్నా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story