తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ

శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

By అంజి  Published on  22 Sep 2023 2:48 AM GMT
TS Weather, Rain Forecast, Telangana, Imd, Yellow Alert

తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం సమీపంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడుతోంది. దానితో సంబంధం ఉన్న కాలం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు పొగమంచు వాతావరణం ఉంటుందని తెలిపింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌ నగర్‌, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్‌, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌ తదితర చోట్ల వర్షం పడింది.

గురువారం ఉదయం అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-టి మండలంలో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని కౌటాలలో 10.1, చింతలమానేపల్లి 6.5, బెజ్జూరు 5.6, ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ 5.2, కరీంనగర్‌ జిల్లా వి సైదాపూర్‌ 4.2, ములుగు జిల్లా మంగపేట 4, వరంగల్‌ జిల్లా పర్వతగిరి 3.9, ములుగు జిల్లా వాజేడులో 3.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు వరంగల్‌లో కూడా భారీ వర్షం కురిసింది. వరంగల్‌తో పాటు హనుమకొండ, కాజీపేటలో ఒక్కసారిగా వాన కురవడంతో ప్రధాన రహదారిపై వరదనీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

సెప్టెంబరు 28 వరకు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే అక్టోబర్ 6 నుంచి 12వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు వీస్తాయని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Next Story