TSRTC: త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ బస్సులు

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రస్తుతం పది ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న టీఎస్‌ఆర్టీసీ వివిధ మార్గాల్లో తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది.

By అంజి
Published on : 12 Oct 2023 12:15 PM IST

TSRTC, electric buses, Telangana

TSRTC: త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ బస్సులు 

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రస్తుతం పది ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ మార్గాల్లో తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. కార్పొరేషన్ 1,860 ఎక్స్‌ప్రెస్, డీలక్స్,సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్ చేసింది. డిసెంబర్‌లో ఎలక్ట్రిక్‌ బస్సును ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది. ఈ చొరవలో భాగంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సుల తయారీని పరిశీలించడానికి టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌ స్వయంగా హర్యానాలోని పల్వాల్‌లోని జేబీఎం గ్రూప్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని పరిశీలించారు. అలాగే రెండు ప్రోటోటైప్ ((నమూనా)) బస్సులతో సహా పురోగతిని ఆయన పరిశీలించారు.

ఈ పర్యటనలో జేబీఎం గ్రూప్ హెడ్ సేల్స్ (నార్త్) ముఖేష్ శర్మ టీఎస్‌ ఆర్టీసీ జీఎమ్‌ ఆపరేషన్స్ ప్రశాంత్ శర్మతో ప్రాజెక్ట్ గురించి చర్చించి విలువైన సూచనలను అందించగా, ఎండీ వీసీ సజ్జనార్ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి బస్సులను వెంటనే టీఎస్‌ ఆర్టీసీకి అందించాలని కోరారు. జేబీఎం గ్రూప్ తమ ఒప్పందం ప్రకారం టీఎస్‌ ఆర్టీసీకి 500 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తుందని సజ్జనార్ చెప్పారు. బస్సులు వాయిదాల వారీగా పంపిణీ చేయబడతాయి. కొన్ని డిసెంబర్‌లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

"టీఎస్‌ ఆర్టీసీ ఈ బస్సులను అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ప్రయాణీకుల సౌకర్యం రాజీపడకుండా చూసుకుంటుంది" అని సజ్జనార్ అన్నారు. మెరుగైన భద్రత కోసం బస్సులలో ప్రయాణీకుల లెక్కింపు సౌకర్యాలు, సీసీ కెమెరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలను గుర్తించడం, నిరోధించడం కోసం ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్స్ వ్యవస్థాపించబడుతుందని, బస్సులలో రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా, గమ్యస్థాన వివరాల కోసం LED బోర్డులు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.

Next Story