ముగిసిన గ్రూప్‌-4 ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌..ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటిప‌డుతున్నారంటే..?

TSPSC Group 4 Application Process closed.గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ శుక్ర‌వారం సాయంత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2023 4:03 AM GMT
ముగిసిన గ్రూప్‌-4 ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌..ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటిప‌డుతున్నారంటే..?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ శుక్ర‌వారం సాయంత్రం 5 గంట‌లకు ముగిసింది. మొత్తం 8,180 ఉద్యోగాల కోసం 9,51,321 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) వెల్ల‌డించింది. అంటే స‌గ‌టున ఒక్కో పోస్టుకు 117 మంది చొప్పున పోటీ ప‌డుతున్నారు. కాగా.. టీఎస్‌పీఎస్సీ ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్లకు ఈ స్థాయిలో ద‌ర‌ఖాస్తులు రావ‌డం ఇది రెండో సారి. 2018లో 700 వీఆర్వో పోస్టుల భ‌ర్త‌కీ రికార్డు స్థాయిలో 10.58ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ నిరుద్యోగ యువత ఆసక్తిగా ఎదురుచూసిన గ్రూప్-4 నోటిఫికేషన్‌ డిసెంబర్ 1న విడుద‌లైంది. తొలుత 9,168 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇందుకు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 23న ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 30న ప్రారంభించారు. అయితే.. స‌మ‌గ్ర‌ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య 8,039 పేర్కొంది. పంచాయితీ రాజ్ విభాగంలో 1129 పోస్టులు త‌గ్గాయి. పంచాయతీ రాజ్ శాఖ నుంచి కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే ప్రతిపాదనలు అంద‌డం, మిగ‌తా వాటి విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రిగింది.

దరఖాస్తు ప్రక్రియ ముగిసే కొన్ని రోజుల ముందు ఖాళీలను స్వ‌ల్పంగా పెంచింది. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ల్లో 141 జూనియర్ అసిస్టెంట్స్ ఖాళీలను గ్రూప్-4 లో చేర్చుతున్నట్లు ప్ర‌క‌టించింది. దీంతో గ్రూప్‌-4 కింద 8,180 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

జూలై 1న గ్రూప్-4 ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షఉండ‌నుంది.

రెండు పేపర్లలోనూ 150 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కొ మార్కు చొప్పున రెండు పేపర్లూ కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహించే పరీక్ష ఓఎంఆర్‌ బేస్డ్‌గా ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది.

Next Story