పార‌ద‌ర్శ‌కంగా కౌంటింగ్‌.. జాప్యానికి కార‌ణం ఇదే : వికాస్ రాజ్‌

TS CEO Vikas Raj speak about Munugode Bypoll Counting.మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 7:16 AM GMT
పార‌ద‌ర్శ‌కంగా కౌంటింగ్‌.. జాప్యానికి కార‌ణం ఇదే : వికాస్ రాజ్‌

మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. అయితే.. కౌంటింగ్ ప్ర‌క్రియ మంద‌కొడిగా సాగుతుండ‌డంతో పాటు ఫ‌లితాలు ఆల‌స్యంగా ప్ర‌క‌టిస్తుండ‌డంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), టీఆర్ఎస్‌(టీఆర్ఎస్‌) పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి(సీఈఓ) వికాస్ రాజ్ స్పందించారు. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని చెప్పారు. 47 మంది అభ్య‌ర్థులు ఉన్నందున ఎక్కువ స‌మ‌యం ప‌డుతోందన్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసిన‌ కారణంగానే ఓట్ల లెక్కింపు అనుకున్న దాని కంటే ఆలస్యంగా జరుగుతోందన్నారు. ఈ సంద‌ర్భంగా మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతున్న వైనాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ఆయా రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఐదుగురు, ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేసిన విష‌యాన్ని గుర్తించాలన్నారు. ఇక‌.. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు, అబ్జ‌ర్వ‌ర్లు ఉన్నారని, ఆర్వో సంతకం చేశాకే ఫలితాలు విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఐదు రౌండ్లు పూర్తి అయ్యేస‌రికి టీఆర్ఎస్‌కు 32,605, బీజేపీకి 30,974, కాంగ్రెస్‌కు 7,380 ఓట్లు వచ్చాయి. ప్ర‌స్తుతానికి టీఆర్ఎస్ 1,631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

Next Story