నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పమ్మగూడెం సమీపంలో గురువారం ఉదయం రైలు ప్రమాదం సంభవించడంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలపైకి వచ్చిన ఎద్దును పల్నాడు ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద ధాటికి ఆ జంతువు రైలు చక్రాల కింద చిక్కుకుపోవడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.
ఈ ప్రమాదం కారణంగా తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వంటి పలు కీలక రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్పై ఉన్న అడ్డంకులను తొలగించే పనులు చేపట్టారు. రైలుకు ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా అనే కోణంలో భద్రతా తనిఖీలు పూర్తి చేసిన తర్వాతే పల్నాడు ఎక్స్ప్రెస్ను ముందుకు పంపిస్తామని అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నారు.