వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నాసాన్పల్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను బర్వాద్ గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య, దోమ పాండుగా గుర్తించారు. ఈ నెల 10వ తేదీన వేటకు వెళ్లిన వీరు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు చెరువులో వారి మృతదేహాలు తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంట పొలాలకు నీటిని తరలించేందుకు కొందరు రైతులు చెరువులో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల వల్ల షాక్ కొట్టి వీరు చనిపోయి ఉండొచ్చని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, పోస్ట్మార్టం నివేదిక వచ్చాక మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వెల్లడించారు.