నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన ఆర్. వసంత అనే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని, క్యాంపస్లోని బాలికల వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న వర్సిటీ అధికారులు మృతదేహాన్ని అత్యంత గోప్యంగా బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వసంత బలవన్మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలా లేక విద్యాపరమైన ఒత్తిడి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ విద్యాసంస్థలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుండటం విద్యార్థి లోకంతో పాటు తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.