హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతోన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. చేప ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. క్యూలో ఉండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే నారాయణ కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానిక వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కాగా మృగశిర కార్తెను పురస్కరించుకుని సిటీలో రెండ్రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లక్షల మంది అస్తమా రోగులు చేప ప్రసాదం కోసం తరలివస్తుంటారు. అదే క్రమంలో క్యూలో నిలబడిన సత్యనారాయణకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కాగా వృద్ధుడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.