తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రక్షాళన..ఏఐసీసీ ఇన్‌చార్జ్ దిశానిర్దేశం

హైదరాబాద్ ఇందిరాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది.

By Knakam Karthik
Published on : 23 April 2025 2:52 PM IST

Telangana, TPCC, state observers meeting, Mahesh Kumar Goud, Meenakshi Natarajan

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రక్షాళన..ఏఐసీసీ ఇన్‌చార్జ్ దిశానిర్దేశం

హైదరాబాద్ ఇందిరాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ.. టీపీసీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పరిశీలకులకు మూడు దశలలో టాస్క్ నిర్దేశించారు. ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులను ఆహ్వానించాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలి. అలాగే టాస్క్-2లో అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మీటింగ్స్, టాస్క్-3లో మండల సమావేశాలు ఏర్పాటు చేయాలి. జైభీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున విజయవంతం అవుతున్నాయి. కోఆర్డినేటర్లు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో జరుగుతోన్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు పరిశీలకులుగా మీకు ఇచ్చిన బాధ్యత అత్యంత కీలకమైనవి. చాలా బాధ్యతగా చిత్తశుద్ధితో చేయాలి. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణాల చాలా కీలకం...అని టీపీసీసీ చీఫ్‌ పేర్కొన్నారు.

ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉంది. బ్రిటిష్ వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. కాంగ్రెస్ పార్టీ విస్తృత భావజాలం ఉన్న పార్టీ. కాంగ్రెస్ జాతీయ పార్టీ జాతీయ స్థాయి ఆలోచనలతో పార్టీ పని చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలతో నడుస్తుంది. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలి. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో సీరియస్ గా పని చేయాలి. ప్రస్తుతం గుజరాత్ మోడల్ గా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్తారంగా జనంలోకి పోవాలి. సిద్ధాంత పోరాటానికి సిద్ధంగా ఉండాలి. దేశంలోనే మొదటి సరిగా తెలంగాణలో కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చారిత్రాత్మకం. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దేశంలో మోడీ ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి..అని మీనాక్షి నటరాజన్ సూచించారు.

Next Story