హైదరాబాద్: సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు. కనీసం ఐదు ఏళ్లు పార్టీలో పని చేసి ఉండాలన్న నిబంధన ఉందని, ఇవాళ అధిష్ఠానం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు తన అభిప్రాయం తీసుకుని లిస్ట్ ఫైనల్ చేస్తుందని, సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వరాదనే నియమం ఉందన్నారు. అలాంటి వారికి ఈ పదవి రాదు అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించారు. తమ రిపోర్టులను రెడీ చేసి అధిష్టానానికి అందజేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, వివిధ సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్ను ఇచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు అందించిన ఈ రిపోర్టుల ఆధారంగానే డీసీసీ పదవులు ఖరారు కానున్నాయి. ఈ రిపోర్టులపై లోతైన విశ్లేషణ, చర్చ అనంతరం తుది నిర్ణయానికి రానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్థాగత నియామకాలు జరుగుతున్నాయి. ఈ నియామకాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఎంతో ముఖ్యమైనది. ఇది పార్టీ యంత్రాంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.