ప్రభుత్వంతో చర్చలు సఫలం..సమ్మె ఉపసంహరించుకున్న జూడాలు

ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.

By Knakam Karthik
Published on : 29 Jun 2025 9:27 PM IST

Telangana, Junior Doctors,  Minister Damodara Rajanarasimha, Strike Decision Withdraw, Stipend Increased

ప్రభుత్వంతో చర్చలు సఫలం..సమ్మె ఉపసంహరించుకున్న జూడాలు

ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకున్నట్లు జూడాలు ప్రకటించారు. తమ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని లేదంటే జూన్ 30 నుంచి ధర్నాకు దిగుతామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి నాలుగు రోజుల క్రితం సమ్మె నోటీసు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూడాలను చర్చలకు ఆహ్వానించారు. అయితే చర్చలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే కాలేజీల్లో, అనుబంధ ఆసుపత్రుల్లో మౌలికసదూపాయాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వంతో తమ చర్చలు సఫలం అయ్యాయని TJUDA అధ్యక్షుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15% స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తోపాటు సీనియర్ రెసిడెంట్స్ కు ఇది వర్తిస్తుందని తెలిపింది. తాజా పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్‌ ఇయర్‌లో రూ.67,032, సెకండ్‌ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్‌ ఇయర్‌లో రూ.74,782 గౌరవ వేతనం ఇవ్వనున్నారు.

Next Story