ఇరిగేషన్‌ కార్యాలయంలో చోరీ.. ప్రాజెక్టుల ఫైల్స్‌ మాయం!

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనం జరిగింది. నీటి పారుదల శాఖకు చెందిన కార్యాలయంలో దొంగలు పడ్డారు.

By అంజి  Published on  8 Jan 2024 8:00 AM GMT
Karimnagar, irrigation department office, Telangana, theft

ఇరిగేషన్‌ కార్యాలయంలో చోరీ.. ప్రాజెక్టుల ఫైల్స్‌ మాయం!

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనం జరిగింది. నీటి పారుదల శాఖకు చెందిన కార్యాలయంలో దొంగలు చొరబడి రూ.2.5 లక్షల విలువైన ఐదు కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎత్తుకెళ్లారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన డేటా, వివిధ ఫైళ్లు కూడా చోరీకి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఆదివారం కావడంతో ఎల్ఎండీ కాలనీలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరు. నైట్ డ్యూటీ కోసం సాయంత్రం వాచ్‌‌‌‌మన్ కనకయ్య ఆఫీసుకు చేరుకునే సరికి.. తాళాలు పగులగొట్టి, తలుపులు తీసి కనిపించాయి. వెంటనే కనకయ్య ఆఫీస్ సూపరింటెండెంట్‌కి సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు విషయం చెప్పారు. ఆ తర్వాత ఇరిగేషన్ ఉద్యోగులు కూడా ఆఫీసుకు చేరుకున్నారు. కార్యాలయం లోపలికి వెళ్లి పరిశీలించగా ఐదు కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, ఇతర ఫైళ్లు, వస్తుఉలు చోరీకి‌‌‌‌ గురైనట్లు గుర్తించారు.

ఆఫీసులో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, విలువైన ఫైల్స్ మాయం కావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన కంప్యూటర్లలో వివిధ‌‌‌‌ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కీలకమైన మానేరు రివర్ ​ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించిన డేటాతో పాటు క్యాంపు క్వార్టర్లు, అటెండర్లు, అభివృద్ధి పనులకు సంబంధించిన డేటా ఉన్నట్లు సమాచారం.

బీరువాను పగులగొట్టి వివిధ ఫైళ్లను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆఫీస్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ఈ కార్యాలయానికి సంబంధించి రివ్యూ సమావేశాలు రెగ్యులర్‌గా జరుగుతున్నట్లు సమాచారం. వాటి వివరాల రికార్డులు మాయం చేసేందుకే చోరీ జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా నిందితులను పట్టుకొని, ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనలో కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు.

Next Story