తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు.
వచ్చే నెల 11వ తేదీ నుండి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలలో తొలిరోజైన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం దేవి అభిషేకం, ధ్వజారోహణ, శిఖరవూజ, సాయంత్రం కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13వ తేదిన షాలిబండ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయం నుండి అమ్మవారి ఘటంను భాజా భజంత్రీలు, డప్పు వాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టిస్తారు.
ఆ తరువాత 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. జులై 20వ తేదిన ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పణ, రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. జులై 21వ తేదీన సోమవారం పోతరాజు స్వాగతం, రంగం, అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.