'పుష్ప' సినిమా స్టైల్లో.. జూ పార్క్‌లో 7 గంధపు చెట్ల దొంగతనం

స్మగ్లర్లు 'పుష్ప' సినిమా స్టైల్‌లో ఏడు గంధపు చెట్లను నరికి చిన్న చిన్నగా చేసి అపహరించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జరిగింది.

By అంజి  Published on  23 July 2023 4:09 AM GMT
sandalwood trees, Hyderabad, zoo park

'పుష్ప' సినిమా స్టైల్లో.. జూ పార్క్‌లో 7 గంధపు చెట్ల దొంగతనం

ఎర్ర చందనం స్మగ్లర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా స్మగ్లర్లు 'పుష్ప' సినిమా స్టైల్‌లో ఏడు గంధపు చెట్లను నరికి చిన్న చిన్నగా చేసి అపహరించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జరిగింది. గత రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నెహ్రూ జూలాజికల్ పార్కుల్లో వన్యప్రాణులతో పాటు ఖరీదైన గంధపు చెట్లు కూడా ఉన్నాయి. అయితే గుర్తుతెలియని కొందరు కేటుగాళ్లు ఏడు గంధపు చెట్లను నరికివేసి, ఆ దుంగలను చిన్నచిన్న ముక్కలుగా నరికివేసి అక్కడక్కడ పడేసారు. ఈనెల 20వ తేదీన జూ అధికారులకు అక్కడక్కడ స్మగ్లర్లు వదిలేసిన దుంగలు కనిపించడంతో కొన్ని దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

జూ అధికారులు వెంటనే అప్రమత్తమే ఆ ప్రాంతాన్ని క్షుణంగా పరిశీలించడంతో ఏడు గంధపు చెట్లు నరికినట్లుగా గుర్తించారు. అనంతరం జూ అధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అయితే జూకు రెండు ఇంట్రీలు ఉన్నాయి. ఆ రెండు ఎంట్రీల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. అధికారులు ఆ సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ గేటు గుండా గంధపు దుంగలను తీసుకువెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించకపోవడంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నరికిన ఏడు గంధపు చెట్ల నుండి కొన్ని దుంగలను మాత్రమే కనిపించకపోవడంతో.. అవి ఎలా తస్కరించారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. జూలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా స్మగ్లర్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. గత ఆరు సంవత్సరాల్లో ఐదు సార్లు స్మగ్లర్లు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇప్పడి వరకు ఒక్కరిని కూడా పట్టుకోలేదు.

జూ లో గంధం చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

జూ పార్కులు గంధపు చెట్లను నరికిన విషయం తెలుసుకున్న వెంటనే ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్​ (పీసీసీఎఫ్​) లోకేష్​ జై స్వాల్​ జూ పార్క్ పరిసర ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి భద్రత కట్టుదిట్టం చేయాలంటూ జూ అధికారులను ఆదేశించారు. గత రెండు రోజుల క్రితం జూ పార్కులో ఏడు గంధపు చెట్లను నరికి వేసిన ప్రాంతాన్ని నిన్న శనివారం రోజున ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్​ (పీసీసీఎఫ్​) లోకేష్​ జై స్వాల్​క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జూ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని క్యూరేటర్​కు సూచించారు. జూ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కట్టుదిట్టమైన సెక్యూరిటీని కూడా నియమించాలన్నారు. జూ చుట్టూ ఎలక్ట్రికల్​ ఫెన్సింగ్​ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా జూ పార్కులో ఉన్న జంతువుల సంరక్షణ, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Next Story