ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. 46 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం

The Telangana cabinet meeting concluded.. It was decided to give pensions to 46 lakh people. తెలంగాణ: ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ దాదాపు 5 గంట‌లకు

By అంజి  Published on  11 Aug 2022 3:55 PM GMT
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ..  46 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం

తెలంగాణ: ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ దాదాపు 5 గంట‌లకు పైగా ఈ స‌మావేశం కొన‌సాగింది. కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్‌ దారులకు ఆసర పెన్షన్‌ కార్డులు అందించనున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరుకు ఒకే చెప్పింది. అలాగే కోఠి ఈఎన్.టి. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్.టి.టవర్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి కేబినెట్‌ ప్రతిపాదనలు చేసింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేయనున్నారు. ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ భేటీలో.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం తీసుకున్నారు. జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని, తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగు షాబాద్‌లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయించింది.

Next Story