తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10,954 జీపీవో పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో వీఆర్ఏ, వీఆర్వోలకు అవకాశం కల్పించింది. ఐదు వేల మంది అప్లయ్ చేసుకోగా 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు. మిగతా ఖాళీల్లోనూ గతంలో వీఆర్ఏ, వీఆర్వోలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరాయి.
ఈ క్రమంలో మిగిలిన ఖాళీల భర్తీకి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని సూచించారు. జీపీవోల ఎంపికకు అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో జీపీవోలు, లైసెన్స్డ్ సర్వేయర్లకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.