హైదరాబాద్ ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు చిరుతను చూసిన సిబ్బంది ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు అందజేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన అధికారులు చిరుత కనిపించిన ప్రాంతాల్లో బుధవారం ఉదయం సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా రెండు మేకలతో ట్రాప్ బోన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం చిరుత ఎట్టకేలకు ట్రాప్ బోనులో చిక్కింది.
ఈ పరిణామంతో ఇక్రిశాట్లో విధులు నిర్వర్తిస్తున్న శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ చిరుతను హైదరాబాద్ జూ పార్కుకు తరలించనున్నట్లుగా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరొక చిరుత సైతం ఇక్రిశాట్లోనే సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అదే చోట రెండు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు.