మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారస్తులు ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తుండటంతో ఈ ప్రాంతంలో నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మల్కాజిగిరి మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
అయితే, జేసీబీలతో అధికారులు రంగంలోకి దిగడంతో చిరు వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని అధికారులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. తమ సామాగ్రిని తామే తొలగించుకుంటామని, కొంత సమయం ఇవ్వాలని వ్యాపారులు అధికారులను వేడుకున్నారు. దీనికి పోలీసులు అంగీకరించి, వ్యాపారులు తమ వస్తువులను పక్కకు జరుపుకునే వరకు వేచి చూశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో ఆక్రమణలను పూర్తిగా తొలగించారు.