తెలంగాణలో రేపు పదో తరగతి ఫలితాలు

తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 April 2024 8:00 AM GMT
telangana, tenth results,  students ,

తెలంగాణలో రేపు పదో తరగతి ఫలితాలు 

తెలంగాణలో ఇప్పటికే ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇక ఇప్పుడు టెన్త్‌ విద్యార్థులు ఎప్పుడు పరీక్షల ఫలితాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం (ఏప్రిల్ 30వ తేదీన) టెన్త్‌ రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం, కంప్యూటరీకరణ కూడా పూర్తికావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

కాగా.. ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరారు. టెన్త్‌ ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేంది. దాంతో.. ఫలితాల విడుదలకు అన్ని రూట్లు క్లియర్ అయ్యాయి. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,07,952 మంది బాలురు ఉండగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఒక వైపు పరీక్షలు జరుగుతుండగా.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది.

టెన్త్‌ పరీక్షల ఫలితాలను తెలుసుకునేందుకు https://results.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తే ఫలితాలు వచ్చేస్తాయి. ఫలితాలతో పాటుగా మార్కుల మెమో కూడా ఉంటుంది. కాగా.. గత ఏడాదితో పోలిస్తే టెన్త్‌ పరీక్షలు ఈ సారి 15 రోజుల ముందుగానే ముగిశాయి.

Next Story