టెన్త్ పరీక్షా ఫలితాలు విడుద‌ల‌..

Telangana Tenth Results Announced. తెలంగాణలో టెన్త్‌ పరీక్షా ఫలితాలు శుక్ర‌వారం విడుదలయ్యాయి.

By Medi Samrat  Published on  21 May 2021 6:35 AM GMT
10th results

తెలంగాణలో టెన్త్‌ పరీక్షా ఫలితాలు శుక్ర‌వారం విడుదలయ్యాయి. మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. కరోనా నేఫ‌థ్యంలో పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు bse.telangana.gov.in, bsetelangana.org వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

ఇక‌ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు చెల్లించిన 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించారు. వీరిలో 2,10,647 మంది 10 జీపీఏ సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తం 535 పాఠశాలలు 10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. ఇక‌ ఈ విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూళ్లలో పదో తరగతిలో 5,46,865 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. అయితే.. 25,473 మంది విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించకపోవడంతో.. వారు FA-1 పరీక్షకు హాజరైనా పాస్ చేయ‌లేదు.

విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సబితారెడ్డి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు పంపిన యెడల వెంటనే సరిదిద్దడం జరుగుతుందని తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్ లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్ ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి కోరారు.



Next Story