సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన B.H.E.L, మియాపూర్ వైపు నివసించే వారి సౌకర్యార్థం B.H.E.L డిపో నుంచి ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 5 వేలకుపైగా బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలోని జిల్లాలకు 2,500.. ఏపీకి 3 వేల వరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులోకి ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే తగు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 27 ఎక్స్ప్రెస్ రైళ్లకు స్పెషల్ హాల్ట్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, లింగపల్లి నుంచి నడిచే 16 రైళ్లు హైటెక్సిటీ స్టేషన్లో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలోని 11 రైళ్లకు చర్లపల్లి స్టేషన్లో హాల్ట్ ఏర్పాటు చేశారు. దీంతో ఐటీ ఉద్యోగులు, నగర ప్రయాణికులకు ఊరట లభించనుంది.