Telangana Polls: 65 స్థానాల్లో పోటీకి దిగనున్న టీడీపీ.. త్వరలో ప్రకటన

వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 65 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది.

By అంజి
Published on : 20 Oct 2023 6:22 AM IST

Telangana polls, TDP, TDP candidates, Chandrababu

Telangana Polls: 65 స్థానాల్లో పోటీకి దిగనున్న టీడీపీ.. త్వరలో ప్రకటన

హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 65 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. నియోజకవర్గాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే ముందు పార్టీ అధిష్టానం తుది నిర్ణయం కోసం వేచి ఉంది. ఈసారి టీడీపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. అది కేవలం రెండు సీట్లు మాత్రమే పొందగలిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు తరువాత అధికార భారత రాష్ట్ర సమితి (BRS)కి ఫిరాయించారు. 2018లో బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) వేవ్ ఉన్నప్పటికీ ఆ పార్టీ 3.5% ఓట్లను సాధించింది. తెలంగాణలో పొత్తులు పెట్టుకోవడానికి తమ పార్టీ వ్యతిరేకమని టీడీపీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలంగాణ టీడీపీ అధినేత కాసాని జ్ఞానేశ్వర్‌ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఇటీవల ప్రకటించారు. ఎన్నికల్లో మా అవకాశాలపై పార్టీ నాయకత్వం ఆశాజనకంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలులో ఉన్నందున పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటనపై ఓ కొలిక్కి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి టీడీపీ తమ అభ్యర్థులను ఎక్కువగా బరిలోకి దించనుంది.

Next Story