తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు అప్పుడేనా..?

తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  13 April 2024 1:39 AM GMT
telangana, inter exams, results, students ,

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు అప్పుడేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ శుక్రవారమే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసింది. ఇక తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకనం నిర్వహించి.. ఈ ప్రక్రియను ఈ నెల 10వ తేదీనే పూర్తి చేశారు. ప్రస్తుతం నమోదైన మార్కుల పరీశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాడు విడుదల అవనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో లాగానే తెలంగాణలో కూడా ఒకేసారి ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా.. తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. ఇలా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మార్చి 10వ తారీఖు నుంచి అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. త్వరితగతిన ఫలితాలను విద్యార్థులకు అందించాలనీ.. అలాగే లోక్‌సభ ఎన్నికలపై ఫలితాల ప్రభావం ఏమాత్రం ఉండొద్దనే ఆలోచనతో ఫలితాలను వెల్లడించే ప్రక్రియను వేగవంతంగా సాగిస్తున్నారు. ఇక మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. దాంతో.. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత విద్యాశాఖ ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Next Story