తెలంగాణలోని స్వతంత్ర సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ పరిధిలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 121ని కోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనివల్ల సినిమా ప్రేక్షకులకు పెద్ద ఊరట లభించింది.
దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ రామావత్ ప్రేమ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ చేపట్టింది. సినిమా టికెట్ కొన్న తర్వాత మళ్లీ ప్రత్యేకంగా పార్కింగ్ ఫీజు వసూలు చేయడం మున్సిపల్ చట్టాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు, తక్షణమే పార్కింగ్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది.