తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..రూ.514 కోట్లు విడుదల
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By - Knakam Karthik |
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..రూ.514 కోట్లు విడుదల
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు ప్రకటించిన బోనస్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం తాజాగా రూ. 514.36 కోట్ల నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఈ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.17 లక్షల మంది సన్న వడ్లు పండించిన రైతులకు ఈ నిర్ణయం వల్ల నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా, కనీస మద్దతు ధర (MSP)కు అదనంగా ప్రతి క్వింటాల్ సన్న వడ్లకు రూ. 500 బోనస్గా చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వివిధ విడతల్లో బోనస్ నిధులను విడుదల చేస్తూ వస్తోంది. తాజా విడుదలతో కలిపి బోనస్ కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు సుమారు రూ. 1,939 కోట్లకు చేరాయి. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో జమ చేయబడతాయి.
రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 70.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో సుమారు 38.37 లక్షల టన్నులు సన్న రకం ధాన్యం కావడం విశేషం. ఇప్పటికే మద్దతు ధర కింద సుమారు రూ. 18,444 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.